ఖాసీం రజ్వీని మించిన నియంత కేసీఆర్‌

6 Jan, 2022 12:02 IST|Sakshi

సాక్షి, నయీంనగర్‌(వరంగల్‌): ఖాసీం రజ్వీని మించిన నియంత సీఎం కేసీఆర్‌ అని హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని భేషరతుగా విడుదల చేయాలని, ఉద్యోగుల బదిలీల జీఓ 317ను సవరించాలని రావు పద్మ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కేయూ జంక్షన్‌లో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను తగులబెట్టే క్రమంలో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల పక్షాన పోరాటం ఆగదన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, శాశ్వతంగా టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.

వేల మందితో టీఆర్‌ఎస్‌ సభలు, ధర్నా నిర్వహిస్తే లేని ఇబ్బంది బీజేపీ నిర్వహిస్తే మాత్రం అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. ధర్నాలో బీజేపీ నాయకులు డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌ రెడ్డి, కొలను సంతోశ్‌రెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, చాడ స్వాతి, రావుల కిషన్, గుజ్జా సత్యనారాయణరావు, దేషిని సదానందంగౌడ్, ఆర్‌.పి.జయంత్‌లాల్, కొండి జితేందర్‌ రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, బైరి శ్రావణ్, మాచర్ల కుమార్, తోపుచర్ల అర్చన, కేతిరెడ్డి విజయలక్ష్మి, తీగల భరత్‌ గౌడ్, భరత్, జగన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు