-

ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం

9 Dec, 2022 07:25 IST|Sakshi

అన్ని వర్గాలను కలుపుకుపోయిన కమలనాథులు  

దశ దిశ లేకుండా చతికిలపడ్డ కాంగ్రెస్‌

పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్‌లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సీఎంతో పాటు కేబినెట్‌ మొత్తాన్నీ మార్చేసి ప్రభుత్వ వ్యతిరేకత బారి నుంచి తప్పించుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా దశా దిశా లేకుండా సాగిన కాంగ్రెస్‌ చివరికి చతికిలపడింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సొంత గడ్డ అయిన గుజరాత్‌లో 27 ఏళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ఏడాది ముందు నుంచి సన్నాహాలు చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయడంతోపాటు ప్రభుత్వానికి కొత్త రూపు రేఖ కల్పించింది. సీఎంగా విజయ్‌ రూపానిని సీఎం పీఠం నుంచి తొలగించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పార్టీని గాడిన పెట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  షాకిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు.

స్థానిక సంస్థలకు కాస్త ముందు 2020 జులైలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన జితు విఘానిని తొలగించి ఆయన స్థానంలో సీ.ఆర్‌.పాటిల్‌కు అవకాశం కల్పించారు. టిక్కెట్ల పంపిణీలో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగానే వ్యవహరించారు. ఏకంగా 41 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు  టిక్కెట్లు నిరాకరించి కొత్త ముఖాలను ప్రోత్సహించారు.

చివరికి ఎన్నికలకి ముందు 140 మంది ప్రాణాలు కోల్పోయిన కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయిన మోర్బీలో కూడా బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధించిందంటే ఆ పార్టీ రచించిన పకడ్బందీ వ్యూహాలే కారణం. మోదీకి దేశ విదేశాల్లో ఉన్న జనాదరణ కూడా ఈ ఎన్నికల ఫలితాలను బాగా ప్రభావితం చేసింది. ఆయన 34 ర్యాలీలు, రెండు భారీ రోడ్‌ షోలతో దాదాపుగా కోటి మంది ఓటర్లను నేరుగా కలిశారు. ‘గుజరాత్‌ను నేనే నిర్మించాను, నన్ను చూసి ఓటు వెయ్యండ’న్న మోదీ విజ్ఞప్తికి ఓటర్లు సానుకూలంగా స్పందించారు.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌  
గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోకుండా సెల్ఫ్‌ గోల్‌ వేసుకోవడం బీజేపీ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో నేతలందరూ బిజీగా ఉండి గుజరాత్‌ను పూర్తిగా వదిలేశారు. గతంలో కాంగ్రెస్‌కు బాగా కలిసొచి్చన  క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చి దళిత ఉద్యమకారుడు జిగ్నేశ్‌ మేవానీ, ముస్లిం వర్గంలో పట్టున్న ఖాదిర్‌ ఫిర్జాదాలకు అక్కున చేర్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకునే కొల్లగొట్టి కొన్ని సీట్లు సొంతం చేసుకోవడం బీజేపీకి లాభించింది. 

సామాజిక సమీకరణలు
సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుని పోయే వ్యూహాలనే బీజేపీ రచించింది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమంతో బీజేపీకి దూరమైన వారిని అక్కున చేర్చుకోవడానికి ఉద్యమ సారథి హార్దిక్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకుంది. 37శాతం ఉన్న ఓబీసీ ఓటర్లపై దృష్టి పెట్టి కాంగ్రెస్‌ నుంచి అల్వేష్‌ ఠాకూర్‌ని చేర్చుకుంది. ఫలితంగా 90 నియోజకవర్గాల్లో పై చేయి సాధించింది. 

చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు)

మరిన్ని వార్తలు