Liquor Scam: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత?: వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?'

22 Dec, 2022 08:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో తనపై వచ్చిన ఆరోపణలన్నీ బోగస్, అసత్యాలేనన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ స్పందించారు. ఆ స్కాంతో ఎలాంటి సంబంధం లేకపోతే.. ఆ కుంభకోణంలో ఉన్న నిందితులు కవిత ఇంటికి ఎందుకు వచ్చారో ఆమె ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.

బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ఛుగ్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో నిందితులతో కవిత జరిపిన చర్చల వివరాలను ఈడీ ఎందుకు చార్జిషీట్‌లో ప్రస్తావించిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి సంబంధం లేకపోతే కవిత పేరును అన్నిసార్లు ఎందుకు ఈడీ పొందుపరిచిందని ప్రశ్నించారు.

ఫోన్‌ను ఎందుకు మార్చారు? 
‘కవిత తన ఫోన్‌ను పదిసార్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత అవసరం ఏముంది.? సమీర్‌ మహేంద్రుతో కవితకు ఏం సంబంధం? ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడిది?’అని ఛుగ్‌ నిలదీశారు. ఫోన్లు మాటిమాటికీ మార్చాల్సినంత మాఫియా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ, పంజాబ్‌ లిక్కర్‌ పాలసీలపైనా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.  

ఆ చెక్కుల వెనుక లిక్కర్‌ కుంభకోణం? 
పంజాబ్‌ రైతులకు కేసీఆర్‌ పంపిణీ చేసిన చెక్కుల వ్యవహారం వెనుక కూడా లిక్కర్‌ కుంభకోణం ఉందని తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. లిక్కర్‌ వ్యవహారంలో భాగంగానే ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌లను కేసీఆర్‌ కలిశారని అన్నారు.
చదవండి: నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్‌ల గగ్గోలు..

మరిన్ని వార్తలు