పవర్ లేని పవర్ మంత్రి ఉరికించి కొడతా అంటుండు.. ఆయనకు సోయి లేదా?

23 Sep, 2022 18:22 IST|Sakshi

సాక్షి, నల్గొండ: టీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతులను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మీటర్‌లు పెట్టినా రైతుల దగ్గర బిల్లు వసూలు చేయబోమని ఏపీ సీఎం జగన్‌ కూడా క్లారిటీ ఇచ్చారని తెలిపారు. ఏ రైతు ఎన్ని యూనిట్లు వాడారో తెలుసుకునేందుకు మాత్రమే మీటర్‌లు పెట్టాలనే ఉద్దేశ్యమని అన్నారు. ఈ విధానం వల్ల ఏ ఒక్క రైతు నష్టపోరని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

'ఏనాడు బీజేపీ అధికారికంగా మోటార్‌లకు మీటర్‌లు అనే ప్రకటన చేయలేదు. ఏ రాష్ట్రంలో అన్నా మీటర్లు పెట్టారా?. డిస్కంలు నష్టపోతున్నాయి, కొత్త విద్యుత్ సంస్కరణలు తేవడం అనేది కేంద్రం ఆలోచన. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే గిరిజన బంధు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. మోదీ మచ్చలేని నాయకుడు. అవినీతి‌రహిత పాలన అందిస్తున్న వ్యక్తి మోదీ. అవినీతి పాలన‌ చేసేది కేసీఆర్ కుటుంబమే. 2014 కంటే ముందు కేసీఆర్ ఆస్తి ఎంత?. ఇప్పుడు లక్షల‌ కోట్లు సంపాదించారు. 

చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!)

కేసీఆర్ ఏనాడన్నా మునుగోడు సమస్యలపై మాట్లాడారా? ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మునుగోడు గురించే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్‌లో చేరితేనే గొర్రెలు ఇస్తామని, పింఛన్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుంది. మంత్రి జగదీష్ రెడ్డికి సోయి లేదు. పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రోడ్లు వేయాలని మంత్రికి సోయి లేదా?. ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం ఇది. ప్రగతి భవన్, కేసీఆర్ ఫాం హౌస్ చుట్టే రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: (అదే బావి.. నాడు భర్త, నేడు భార్య) 

'జగదీష్ రెడ్డి ఉరికించి కొడతా అంటోండు. ఎవరిని‌కొడతావ్. టీఆర్ఎస్‌కి క్యాండిడేట్‌ని ప్రకటించే దమ్ము లేదు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఇరవై, ముప్పై లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు రెండు ఊర్లకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జా. అవినీతి సొమ్ము, డబ్బు మూటలు తీసుకొచ్చి కొనుగోలు చేస్తారా' అని ప్రశ్నించారు. మీరెన్ని చేసినా ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు