కొల్లాపూర్ సభలో బండి సంజయ్
ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్కు బడిత పూజ చెయ్యాలి
మాజీ సీఎస్ సోమేశ్ అక్రమాలపై కేసులు పెట్టాలి
కొల్లాపూర్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లు ప్రధాని నరేంద్ర మోదీకి వంగి దండాలు, పొర్లుదండాలు పెట్టిండు. ఇప్పుడు తిడుతున్నడు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న దందాలపై కేంద్రం దృష్టి పెట్టింది. కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో దొంగసారా దందా చేసింది. పత్తాలాట, క్యాసినోలు కూడా నడుపుతు న్నరు. కేసీఆర్ కుటుంబం చేయని దొంగ దందా లు లేవు. వీటి మీద విచారణ జరిగితే కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవడం ఖాయం. అందుకే ప్రధాని మోదీని, బీజేపీని తిడుతున్నరు’అని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీజేపీ నాయకుడు ఎల్లేని సుధాకర్రావు 37 రోజుల పాటు చేపట్టిన ప్రగతి కోసం పాదయాత్ర ముగింపు సభకు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆంధ్రోళ్లను అవమానించిండు, వాళ్లకు బిరియాని వండనీకే రాదన్నడు, తెలుగుతల్లిని అవమానించిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మళ్ల ఆంధ్రకు పోతున్నడు. తెలంగాణలో మా వాళ్ల మనోభావాలను ఎవరైన దెబ్బతిస్తే వాళ్లను ఉరికించి రాళ్లతో కొడతం. ఆంధ్రోళ్లు కూడా కేసీఆర్కు బడిత పూజ చెయ్యాలె’అని అన్నారు.
పేదోళ్ల ఉసురు పోసుకొని, జీఓ 317 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ఆస్పత్రుల పాలుచేసి, 30 మంది ఉద్యోగుల చావులకు కారణమైన మాజీ సీఎస్ సోమేశ్కుమార్కు రాష్ట్ర హైకోర్టు చెంప చెల్లుమనేలా తీర్పునిచ్చి ఆయనను ఏపీకి పంపించిందన్నారు. సోమేశ్కుమార్ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అనుభవం, నిజాయితీ, సత్తా ఉన్న ఐఏఎస్ అధికారులను పక్కనబెట్టి ఇన్నాళ్లు రబ్బర్ స్టాంపులా ఉండే వారికి సీఎస్ పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.
కేంద్రం ఇప్పటివరకు 1.46 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని, ఈ ఏడాదిలో 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం 22 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే, వాటిని కేసీఆర్ ప్ర«భుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిందువులు అయ్యప్ప, భవాని, శివ, హనుమాన్ దీక్షలు చేపట్టకుండా చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ను ఓడించేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.