‘మంత్రి కేటీఆర్‌ ఒక అజ్ఞాని’.. ఆయన సవాల్‌ నేను స్వీకరించడమేంటీ..

15 Sep, 2021 08:48 IST|Sakshi
మెదక్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి,  మెదక్‌: ‘మంత్రి కేటీఆర్‌ అజ్ఞాని, ఆయన సవాల్‌ను నేను స్వీకరించటం ఏంటి.. ఆయన అయ్య వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల లెక్కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద కూర్చొని చూపిస్తాను’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారంనాటికి 250 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2 లక్షల 74 వేల కోట్లు చెల్లిస్తే, రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది రూ.లక్షా 42 వేల కోట్లు మాత్రమేనని, ఇది అబద్ధమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై సంజయ్‌ పైవిధంగా స్పందించారు. గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే 32 శాతం నిధులను మోదీ ప్రభుత్వం 41 శాతానికి పెంచింది నిజం కాదా అని సంజయ్‌ ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో కొనసాగుతున్న వెయ్యికిపైగా ప్రైవేట్‌ బస్సులను తొలగించటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులను సైతం అమ్మేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సకలజనుల సమ్మెలో పాల్గొన్న సబ్బండ వర్గాలను మోసం చేసిన కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయా లని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సకలజనుల సమ్మె చేసి పదేళ్లు అవుతున్న వేళ కేసీఆర్‌ ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ మాటల వల్లే రైతుల ఆత్మహత్యలు
వరిపంట సాగుచేస్తే.. ఉరివేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అనడం వల్లే ఆందోళన చెంది, రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ చేసిన హత్యలేనని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామయాత్ర మంగళవారం మెదక్‌ చేరుకోగా పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ రైతులోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికీ కేసీఆర్‌ పాతబస్తీకి వెళ్లాలంటే ఎంఐఎం అధినేత అను మతులు తీసుకుంటారని, కానీ ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలో కాషాయం జెండాను ఎగరవేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఈసారి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేసీఆర్‌ను గజ్వేల్‌ చౌరస్తాలో ఉరేస్తామని హెచ్చరించారు. మంచి జరిగితే తమది.. చెడు జరిగితే కేంద్రాని దంటూ బద్నాం చేస్తున్నారని విమర్శించారు.  

చదవండి: ‘అక్కడ వంగి వంగి దండాలు పెట్టుడు.. ఇక్కడికి రాంగనే తిట్ల పురాణం’

మరిన్ని వార్తలు