రాష్ట్రంలో అరాచక పాలన 

4 Sep, 2020 03:29 IST|Sakshi
గురువారం ఖమ్మంలోని గోళ్లపాడు నిర్వాసితులనుద్దేశించి మాట్లాడుతున్న బండి సంజయ్‌

 బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజం  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ సాక్షినెట్‌వర్క్‌ వరంగల్‌: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. గురువారం రాత్రి ఖమ్మం నగరంలోని గోళ్లపాడు నిర్వాసిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలను బిచ్చగాళ్లుగా చూస్తున్నారని, పట్టణ, నగర నడిబొడ్డున ఉన్న పేదలను అభివృద్ధి పేరుతో శివారు గ్రామాలకు తరలిస్తూ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.  నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గోళ్లపాడు చానల్‌ నిర్వాసితులకు పూర్తి అండగా ఉంటామన్నారు.

కేసీఆర్‌ అవినీతి చిట్టా తయారవుతోంది 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాశ్వతంగా జైలులో ఉండే విధంగా అవినీతి చిట్టా తయారవుతోందని బండి సంజయ్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లా ధర్మారం, నర్సంపేట, మహబూబాబాద్, గూడూరులలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, టీఆర్‌ఎస్‌ అవినీతికి వ్యతిరేకంగా మలిదశ ఉద్యమం ప్రారంభం కాబోతోందన్నారు.  2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయ మని జోస్యం చెప్పారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు షాక్‌ ఇవ్వనున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు