అన్ని పార్టీల్లో అడుగడుగునా కేసీఆర్‌ కోవర్టులు

30 May, 2023 04:17 IST|Sakshi

ఆయన పాలి‘ట్రిక్స్‌’ అన్నీ నాకు తెలుసు: బీజేపీ నేత ఈటల

కాంగ్రెస్‌ను ఎటూ కాకుండా చేయడాన్ని దగ్గరుండి చూశా..

ఈసారి ఆ పార్టీని అమాంతం మింగేస్తారు

పొంగులేటి, జూపల్లి వేరే పార్టీల్లో చేరకుండా ఆపగలిగా..

వారితో జాతీయ నాయకత్వం మాట్లాడుతోందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అమలు చేసే ‘పొలిటికల్‌ ట్రిక్స్‌’ అన్నీ తన­కు తెలుసని.. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వ్యవ­హరిస్తారో దగ్గరుండి చూశానని బీజేపీ జాతీయ కార్య­వర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీ­ల్లో­నూ కేసీఆర్‌ అడుగ­డుగునా కోవర్టులను పెట్టుకుని రాజకీయా­లు చేస్తున్నారని.. ఇటీవల వివిధ పార్టీల్లో చోటుచేసు­కున్న పరిణామాలు దీనిని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రభు­త్వ తొమ్మిదేళ్ల పాలనపై కేంద్ర మంత్రి అర్జున్‌­రామ్‌ మేఘ్‌వాల్‌ సోమవారం హైదరాబాద్‌లో పవర్‌పా­యింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన సందర్భంగా ఈటల మీడియా ప్రతినిధుల­తో ఇష్టాగోష్టిగా మాట్లాడా­రు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలే ఓడించబోతున్నారన్నారు.

కాంగ్రెస్‌ను అమాంతం మింగేస్తారు
కాంగ్రెస్‌ పార్టీని ఎలా డీల్‌ చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని, గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఈటల చెప్పారు. 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్‌ సర్కార్‌పై, అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై కాంగ్రెస్‌ పుంజుకుంటున్నదన్న దశలో.. ఆ పార్టీని ఎటూకాకుండా చేసిన తీరును తాను దగ్గరి నుంచి గమనించానని చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ నాలుకకు కూడా తగలకుండా అమాంతం మింగేస్తారని వ్యాఖ్యానించారు.

నాకే రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్, మరే ఇతర పార్టీలో చేరకుండా ఇప్పటిదాకా జరిపిన చర్చల ద్వారా ఆపగలిగానని ఈటల చెప్పారు. తమ చర్చ­ల్లో వారు అనేక అంశాలను ప్రస్తావించడంతో­పాటు తనకే రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్న సంద­ర్భాలు కూడా ఉన్నాయని నవ్వుతూ చెప్పారు. వారితో బీజేపీ హైకమాండ్‌ చర్చలు జరుపుతోందన్నారు.

ఖమ్మం జిల్లా సంప్రదాయకంగా కమ్యూ­నిస్టులకు, కాంగ్రెస్‌కు పట్టున్న జిల్లా అన్న విష­యం అందరికీ తెలిసిందేనని.. అయితే బీజేపీ­లో పొంగులేటి, జూపల్లి చేరడం కష్టమేనని తాను అన­ని మాటలను అన్నట్టుగా కొందరు ప్రచారం చేస్తు­న్నారని ఈటల మండిపడ్డారు. ప్రభుత్వం, అధికా­ర పార్టీ రాజకీయాలు, అధికారుల ఒత్తిళ్లను ఎదు­ర్కొ­ని మరీ ప్రజల అండదండలతో హుజూరా­బాద్‌­లో గెలవగలిగానన్నారు. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పో­టీ­చేస్తానని తాను ప్రకటించగానే.. అక్కడా తనకు ప్రజల మద్దతు పెరిగిందని, సోషల్‌మీడి­యాలో 72 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైందని చెప్పారు.  

మరిన్ని వార్తలు