Huzurabad Bypoll-Etela Rajender: కేసీఆర్‌కు మైలపోలు తీసుడు ఖాయం

4 Sep, 2021 03:00 IST|Sakshi

కేసీఆర్‌కు అవసరముంటేనే ప్రజలను పట్టించుకుంటారు: ఈటల 

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు మైలపోలు తీసుడు ఖాయమని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం కుమ్మర కులస్థుల శంఖారావం సందర్భంగా పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. ‘టీఆర్‌ఎస్‌ నాయకులు దళితవాడలకు వెళ్లి ఇంటికో రూ.10 లక్షలు ఇస్తం. గులాబీ కండువా కప్పుకోవాలని అంటున్నారు. నా రాజీనామా వల్లే హుజూరాబాద్‌కు ఇంత దశ వచ్చింది, ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు మళ్లీ ఇప్పుడు అందుతున్నాయి’ అని అన్నారు.

సీఎం కేసీఆర్‌కు అవసరం ఉంటేనే ప్రజలను పట్టించుకుంటారని, ఫాంహౌస్‌ నుంచి బయటికి వస్తున్నారని విమర్శించారు. ఓట్లు అవసరం ఉంది కాబట్టే కేసీఆర్‌ మొదటిసారి దళితులను పిలిపించుకొని బువ్వ పెట్టి పోయారన్నారు. జాతీయ ఖాదీ బోర్డు చైర్మన్‌ పేరాల శేఖర్‌జీ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక దేశానికి దిక్సూచిగా మారనుందని, ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు