రాష్ట్రాన్ని టీడీపీ నాశనం చేసింది 

29 Aug, 2022 04:20 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి 

చిత్తూరు (కార్పొరేషన్‌): ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీ సొంత ప్రయోజనాలే తప్ప ప్రజావసరాలను పట్టించుకోవడం లేదన్నారు. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ప్రజల కోసం వారు ఎటువంటి పోరాటాలు చేయడంలేదని విమర్శించారు.

వందేళ్లుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు బూజు పట్టిన సిద్ధాంతాలతో వెంటిలేటర్‌పై ఉన్నాయని తెలిపారు. వారు ఎందుకు ఇంకా అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు. సినీ నటుడు ఎన్టీఆర్, నితిన్‌ బీజేపీకి ఆకర్షితులయ్యారన్నారు. తెలంగాణ వాసులు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారని తెలిపారు. ఎంఐఎం మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని, వాటిని నిషేధించాలన్నారు. సీపీఎస్‌ రద్దును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కప్పం ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. రంజాన్, క్రిస్మస్‌కు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కోలా ఆనంద్, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ 
పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు