మిషన్‌–90 లక్ష్యంగా సాగండి.. రాష్ట్ర బీజేపీ నేతలకు కీలక సూచనలు..

17 Dec, 2022 02:00 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టండి

బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలి

మిషన్‌–90 లక్ష్యంగా సాగండి

ధైర్యంగా ముందుకు వెళ్లి రాష్ట్రంలో అధికారం సాధించండి 

బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆరునెలల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ మరింత పకడ్బందీగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ నాయకులు స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున తగిన వ్యూహాలతో కచ్చితంగా గెలుపొందేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వివిధవర్గాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో ఇతర విపక్ష పార్టీల తీరును ప్రజలకు వివరించి, బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన మోదీ ›ప్రభుత్వం, నాయకత్వం ఉన్నందున ధైర్యంగా ముందుకెళ్లి ఇక్కడ అధికారాన్ని సాధించాలని స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన రూపాలను ఎంచుకోవాలని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ భేటీకి హాజరైన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, సహ ఇన్‌చార్జి అర్వింద్‌మీనన్‌ ఆయా అంశాలపై మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 

సమష్టిగా ముందుకు..
రాష్ట్ర నాయకత్వం మొదలు గ్రామస్థాయి వరకు ఎలాంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా సమష్టితత్వంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని బీజేపీ జాతీయ నాయకులు కోర్‌కమిటీలో స్పష్టంచేసినట్టు సమాచారం. పార్టీపరంగా వివిధ స్థాయిల్లో నిర్వహించిన అధ్యయనాలు, పరిశీలనల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 70 చోట్ల బీజేపీ బలంగా ఉన్నట్టు తేలిందని ఈ భేటీలో తరుణ్‌ చుగ్‌ వెల్లడించినట్టు సమాచారం. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిషన్‌–90.. అంటే 90 అసెంబ్లీస్థానాలపై పూర్తి లక్ష్యంతో మొత్తం పార్టీ పనిచేసే దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయశాంతి, జి.వివేక్‌ వెంకటస్వామి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు.

కొత్తగా అసెంబ్లీ పాలక్‌లు..
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కోర్‌ కమిటీలను కూడా కుదించి ‘అసెంబ్లీ పాలక్‌’ల వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర చోట్ల మూడురోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ ఇన్‌చార్జి, అసెంబ్లీ పాలక్‌లు, అసెంబ్లీ కన్వీనర్‌లు, అసెంబ్లీ విస్తారక్‌ లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఒక నేతతో కలిపి మొత్తం ఐదుగురితో నియోజకవర్గాల వారీగా పరిమిత కోర్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 30న కమిటీలతో జరిగే సమావేశానికి జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వెంటనే అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ కమిటీల ఏర్పాటు, జనవరి చివరికల్లా మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. 

ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణకు బీఎల్‌ సంతోష్‌?
ఈ నెల 28, 29 తేదీల్లో ఘట్‌కేసర్‌ వద్ద దక్షిణాది రాష్ట్రాల బీజేపీ పార్లమెంట్‌ విస్తారక్‌ (ఫుల్‌ టైమర్‌)ల శిక్షణ తరగతులకు బీఎల్‌ సంతోష్‌ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ తరగతులకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఫుల్‌ టైమ్‌ కార్యకర్తలు హాజరుకానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ నియోజక వర్గాలపై బీజేపీ హైకమాండ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 

27న కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ధర్నా
రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, ధరణి పోర్టల్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. కాగా, సోమ, మంగళ, బుధవారాల్లో అన్ని జిల్లాల పదాధికారుల సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, గుజ్జుల ప్రేమేందర్, ఎన్వీ సుభాష్‌ తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. జనవరి 7న నిర్వహించే సమ్మేళనంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా పాల్గొంటారని చెప్పారు. 

తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తోంది: తరుణ్‌ చుగ్‌
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ దూసుకెళ్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఏమీ చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కేసీఆర్‌ను ప్రజలు ఇక వద్దనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనతో విసుగుచెందిన ప్రజలు ఆయనను ఇక ఏమాత్రం గౌరవించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కేసీఆర్‌ మదిలో తెలంగాణపై ద్వేషం ఉందని వ్యాఖ్యానించారు. దీనికి తోడు కేసీఆర్‌ అహంకారపూరిత వైఖరి కూడా ఆయన్ను నిండా ముంచిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్, తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో ఇప్పుడు పార్టీ పేరులో కూడా తెలంగాణ లేకుండా పోయిందన్నారు.

మరిన్ని వార్తలు