బొమ్మై సర్కార్‌కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే.. అసెంబ్లీలోనే తీవ్ర విమర్శలు

15 Dec, 2021 17:23 IST|Sakshi

బెంగళూరు: పాడైపోయిన రోడ్లు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేయడమంటే సవాలుతో కూడుకొని ఉన్నదే. ఆ దారుల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రోడ్లు సరిగా లేకపోడం కూడా  రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. అయినా నేతలకు చీమ కుట్టిన్నట్లు కూడా ఉండదు. తాజాగా బెంగుళూరులోని రోడ్ల పరిస్థితి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు దారితీసింది. చెడిపోయిన, గుంతలమయమైన రోడ్ల వల్ల బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్షాలతోపాటు అధికార ఎమ్మెల్యే సైతం విమర్శలు గుప్పించారు. బెంగుళూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 

అయితే రాష్ట్రంలో బీజీపీ అధికారంలో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వంపై విమర్శలు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీలో శీతాకాల సమావేశాల సందర్భంగా.. బెంగళూరుతో పాటు చుట్టు పక్కల రోడ్ల పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబావలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో రోడ్లను మెరుగు పరేచేందుకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. 
చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశృతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి..

బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మాట్లాడుతూ.. తన నియోజవవర్గంలో బెంగళూరు చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేస్తున్న ఆర్థికసాయం నిధులు సరిపోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో అత్యధిక గ్రామలు ఉన్నాయని కానీ తక్కువ నిధులు ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని నేను సీఎంకు కూడా వివరించానని, రోడ్లను పునరుద్ధరిండడానికి కేవలం రూ. 1,000 కోట్లు కేటాయిస్తే సరిపోదన్నారు. వర్షాలు తగ్గడంతో  బెంగళూరులో రోడ్లను పునరుద్ధరించాలని అరవింద్ లింబావలి కోరారు..
చదవండి: Sania Mistry: స్లమ్‌ సెన్సేషన్‌... ర్యాపర్‌ సానియా.. ఒక్కసారి వింటే!

రోడ్లు వేయడం, రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం లోపించిందని  మండిపడ్డారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు పైప్‌లైన్‌లను వేస్తోంది. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) కూడా రోడ్లను తవ్వుతోంది. వారి మధ్య పూర్తిగా సమన్వయం లోపించింది. వీరి మధ్య కాస్త సమన్వయం ఉంటేనే బెంగళూరు నగరం, రోడ్లు బాగుంటాయన్నారు. బెంగళూరు రోడ్ల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. 

కాగా రోడ్ల పరిస్థితిపై బీజేపీ ఎమ్మెల్యేతోపాటు  రోడ్డు పనులకు నిధుల మంజూరులో జాప్యంపై జేడీఎస్‌కు చెందిన దాసరహళ్లి ఎమ్మెల్యే ఆర్‌ మంజునాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైటరాయణపురకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరేగౌడ కూడా మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు