బండి సంజయ్‌ Vs అరవింద్‌: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు

12 Mar, 2023 18:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా బండి సంజయ్‌- అరవింద్‌ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అరవింద్‌ తప్పుబట్టారు. కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను సమర్థించనని అరవింద్‌ అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్‌ సెంటర్‌ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది’’ అంటూ అరవింద్‌ సూచించారు.

‘‘కవిత ఈడీ ఆఫీసులో ఉంటే తెలంగాణ కేబినెట్‌ అంతా ఢిల్లీలో మకాం వేసింది. ఇదే చిత్తశుద్ధి ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేది’’ అని అరవింద్‌ పేర్కొన్నారు. ‘‘దర్యాప్తు కు కవిత సహకరించలేదని తెలిసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే.. కవిత ఏమో, తెలవదు, గుర్తు లేదు అని సమాధానం చెప్పినట్టు తెలిసింది. చేతికి 20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. అవినీతిని అంతం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు’’ అంటూ ఎంపీ అరవింద్‌ దుయ్యబట్టారు.
చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

మరిన్ని వార్తలు