రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు: ఎంపీ

7 Nov, 2020 19:44 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: రైతులను సన్న రకం సాగు చేయమని, మంచి ధర ఇప్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పారని బీజేపీ ఎంపీ ఆరవింద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల కోసం మక్కలకు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఇప్పిస్తామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. దీంతో ఆయన తీరుకు రైతులు ఆవేదన చెందున్నారని, కేంద్రం ఇస్తున్న ఎంఎస్‌పీకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదన్నారు. కడ్త పేరుతో 9 శాతం తరుగు తీస్తున్నారని, పాల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులకు, రైస్‌ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, కేసీఆర్ తీరుతో రైతులకు ప్రభుత్వాలపై నమ్మకం పోతుందన్నారు.

ముస్లింలకు కేంద్రం అన్ని ఇస్తున్నా కేసీఆర్ వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కన్న మంచి వ్యవస్థను కేంద్రం ఇచ్చినా కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆర్ సర్కార్‌యే అన్నారు. విద్యుత్ బకాయిలు ఎగ గొట్టేందుకు విద్యుత్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు. కొత్త రాష్ట్రంలో ఒక్క కొలువు కూడా ఇవ్వలేదని, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలు నాశనం అయ్యాయి.. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అయిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు