ఢిల్లీ లిక్కర్‌ స్కాం: కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది.. బండి అరెస్ట్‌ ఎందుకు?

23 Aug, 2022 13:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టీఆర్‌ఎస్‌ పార్టీ(తెలంగాణ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు. లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేకుంటే.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ మండిపడ్డారాయన. 

మంగళవారం బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, మరో ఎంపీ పర్వేష్‌వర్మతో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్‌లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందన్న ఆయన.. కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేకుంటే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ప్రజాస్వామ్యుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?. రాజకీయ కారణాలతోని అన్యాయంగా అరెస్టు చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో పూర్తిగా శోధించి సత్యాన్ని బయటకి తీస్తాయి. మేం ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు?. ఎంపీగా సంజయ్‌కు నిరసన తెలిపే హక్కు లేదా? అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం అని ఎంపీ సుధాన్షు వెల్లడించారు. 

భారీ స్కాం జరిగింది: బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ 
ఢిల్లీలో మద్యం దుకాణాలకు ఎల్ - వన్ కమిషన్ రెండు నుంచి 12 శాతం పెంచారని, అది ఎందుకో ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదు ఢిల్లీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ ఎంపీ, బీజేపీ నేత పర్వేష్‌ వర్మ మండిపడ్డారు. ‘ఢిల్లీలో ఒక బాటిల్‌కు మరొక బాటిల్ ఉచితంగా ఇచ్చారు. కార్టెల్‌గా మారి జోన్లు ఇవ్వాలని మద్యం విధానంలో లేదు. మద్యం ఉత్పత్తి , డిస్ట్రిబ్యూషన్ , రిటైలర్.. ఈ మూడు ఒక్కరే. మహాదేవ్, బడి పంజా కంపెనీలు ఈ బిజినెస్ చేస్తున్నాయి. కరోనా నష్టాల పేరుతో 144 కోట్ల రూపాయలు మద్యం మాఫియాకు మాఫీ చేశారు.  

ఇది మద్యం పాలసీకి వ్యతిరేకం. ఎల్ -1 రిటైలర్ కు క్రెడిట్ నోట్ ఇచ్చి, వారి నుంచి వచ్చే నగదు ఆప్ పార్టీకి తరలించారు. ఆ డబ్బు ఎన్నికలకు వినియోగించి మోదీకి మేమే పోటీ అని అంటున్నారు. ఈ పాలసీ వల్ల విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై పన్ను కూడా తగ్గించారు. పన్నులలో, ఆదాయంలో ప్రభుత్వానికి ఖజానాకు గండి కొట్టారు. మొత్తం 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం జరిగింది. ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది అని ఎంపీ పర్వేష్‌ వర్మ, ఆప్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీ చదవండి: 33 జిల్లా కోర్టుల్లో కవిత పరువునష్టం దావా!

మరిన్ని వార్తలు