తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఆరా తీస్తున్న జాతీయ నాయకత్వం

6 Sep, 2022 07:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీపై నేతలు ఏమేరకు సన్నద్ధంగా ఉన్నారన్న దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. ఇప్పట్నుంచే ఎన్నికల వ్యూహాల కోసం సమాచార సేకరణలో నిమగ్నమైంది. ఆది, సోమవారాల్లో నాలుగేసి జిల్లాల చొప్పున వేర్వేరుగా నిర్వహించిన జిల్లా కోర్‌ కమిటీల సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నావళి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల సమావేశం సందర్భంగా ఏయే నియోజకవర్గాల్లో, ఎవరెవరు పోటీకి సిద్ధపడుతున్నారు? బలమైన నేతలు ఎవరైనా బీజేపీలో చేరుతారా? అనే వివరాలను సేకరించినట్టు తెలిసింది. మంగళవారం ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లా కోర్‌ కమిటీతో భేటీ జరగనుంది. 

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు డబ్బు సంచులు
మునుగోడు సర్వేలన్నీ బీజేపీకే అనుకూలమని, ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు, కేసీఆర్‌ సొంత సర్వేలు చెబుతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్‌ కమిటీ భేటీలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. గెలుపుపై అపనమ్మకంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలకు ప్రగతిభవన్‌ నుంచి డబ్బు సంచులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్‌!

మరిన్ని వార్తలు