భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా? బీజేపీ వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం..

25 Nov, 2022 15:29 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్‌ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందకు సంబంధించిన ఓ వీడియోనూ ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్‌ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. 

ఈ వీడియోను మొదట మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసిందని, కానీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు గమనించాక వెంటనే దాన్ని డిలీట్ చేసిందని మాలవీయ ఆరోపించారు.  కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని విమర్శలు గుప్పించారు.

అయితే మాలవీయ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోనూ షేర్ చేసి తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.

ఈ విషయంపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.
చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్‌.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం..

మరిన్ని వార్తలు