రైతుల ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలి 

21 Jan, 2023 01:07 IST|Sakshi

మాస్టర్‌ప్లాన్‌ రద్దుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌   

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఉద్యమాలతో కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల మాస్టర్‌ప్లాన్లు రద్దు అయ్యాయని, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను తరిమికొట్టే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది రైతన్నల విజయమని, వారి ఉద్యమస్ఫూర్తికి అభినందనలు అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ రద్దు పోరులో నేను కూడా పాల్గొన్నాను. నాతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు. పోలీసులు మాపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు కూడా పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు’ అని సంజయ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ పాలనలో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు