బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్‌ దాఖలు

30 Mar, 2021 05:27 IST|Sakshi
నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

నెల్లూరు (అర్బన్‌): తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ తరుఫున రత్నప్రభ సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి, తమ పార్టీకి నడుమ జరుగుతోందని, రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రాయలసీమకు నీటి కరువు లేకుండా చేస్తామని చెప్పారు.

నామినేషన్‌ వేసిన సీపీఎం అభ్యర్థి యాదగిరి
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు సీపీఎం అభ్యర్థి యాదగిరి సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఎం ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందన్నారు. బీజేపీ దుర్మార్గాలన్నింటినీ ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. 

మరిన్ని వార్తలు