బీజేపీకి ఊరట: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

10 Mar, 2021 18:07 IST|Sakshi
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్ట్ర్‌ (ఫోటో కర్టెసీ: ఇండియా)

హర్యానాలో బీజేపీకి ఊరట

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

చండీగఢ్‌: హర్యానాలో బీజేపీకి ఊరట లభించింది. రాష్ట్రంలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమికి 55 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 32 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా ఆరోపించారు. 

చదవండి:

బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్‌

మరిన్ని వార్తలు