BMC Election 2022: ఆ ఓట్లన్నీ బీజేపీకే.. చెక్‌ పెట్టేందుకు శివసేన..

30 Aug, 2021 09:58 IST|Sakshi

నాయకులకు పదవుల తాయిలాలు 

ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల ప్రయత్నాలు 

మైనార్టీ ఓట్లు, ఉత్తర భారతీయుల ఓట్లు పొందడమే లక్ష్యంగా వ్యూహాలు 

మొహిసిన్‌ షేక్‌కు యువసేన 

ఉపకార్యదర్శి పదవినిచ్చిన శివసేన 

కృపాశంకర్‌సింగ్‌కు ప్రదేశ్‌ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టిన బీజేపీ 

సాక్షి, ముంబై: వచ్చే ఏడాది బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రాంతాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా తమ తమ పార్టీల్లోని ప్రభావం చూపగల నాయకులకు పదవులు కట్టబెడుతున్నాయి. ఈ మేరకు శివసేనకు చెందిన మొహిసిన్‌ షేక్‌కు యువసేన ఉపకార్యదర్శి పదవిని అప్పగించింది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని బీజేపీలో చేరిన మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌కు మహారాష్ట్ర ప్రదేశ్‌ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో మైనారిటీలు, ఉత్తర భారతీయుల ఓట్లు తమకే పోలవుతాయని ఇటు శివసేన, అటు బీజేపీ లెక్కలు కడుతున్నాయి.

సుమారు 96 లక్షల మంది ఓటర్లు
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో సుమారు 96 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 70–80 శాతం మంది మరాఠీ ఓటర్లు కాగా, మిగతావారు గుజరాత్, రాజస్తాన్, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన ఓటర్లు. అయితే, సాధారణంగా ఏ ఎన్నికలోనైనా మరాఠీ ఓట్లు చీలిపోగా గుజరాతీ, మార్వాడీ, ఉత్తర భారతీయుల ఓట్లు గంప గుత్తగా ఒకే పారీ్టకి పోలవుతాయి. దీంతో స్థానిక ఓటర్లతో పోలిస్తే ఉత్తర భారతీయులు, మైనార్టీల ఓట్లే ఏ ఎన్నికలోనైనా కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో బీఎంసీ, అసెంబ్లీ, లోక్‌సభ, ఇతర స్థానిక సంస్ధలు ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చన ప్రతీసారి అన్ని పార్టీల నాయకులు ఉత్తర భారతీయులను, మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

ఆ  ఓట్లన్నీ బీజేపీకే..
ఇదిలావుండగా 2014 నుంచి ఉత్తర భారతీయ, యువ మరాఠీ ఓటర్లు సహా ఉన్నత వర్గాల ఓటర్లు బీజేపీ దిశగా మళ్లారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదంతో శివసేన, బీజేపీలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఉత్తర భారతీయుల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారిని మరింత ఆకర్శించేందుకు బీజేపీ కొత్త ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించింది. అందుకు పదోన్నతులు కల్పించే అంశాన్ని తెరమీదకు తెచి్చంది. ముంబైలో ఉత్తర భారతీయ ఓటర్లు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. ఈ ఓట్లు 2014 నుంచి బీజేపీకే పోలవుతున్నాయి.

బీజేపీకి చెక్‌ పెట్టేందుకు
ఇటీవల బీజేపీలో చేరిన కృపాశంకర్‌ సింగ్‌కు ఉత్తర భారతీయ ఓటర్లలో మంచి పట్టు ఉంది. దీంతో సింగ్‌ను ప్రదేశ్‌ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మరోపక్క బీజేపీకి చెక్‌ పెట్టేందుకు శివసేన కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరాఠీ ఓట్లతో పాటు కీలక పాత్ర పోషించే మైనార్టీల ఓట్లపై ఆ పార్టీ దృష్టి సారించింది. గత బీఎంసీ ఎన్నికల్లో పశ్చిమ అంధేరీ, ములుండ్‌ నియోజకవర్గాలలో శివసేన కార్పొరేటర్లు ఒక్కరు కూడా గెలవలేకపోయారు. దీంతో శివసేనకు కొత్త ఓటు బ్యాంకును ఏర్పా టు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబైలో 16 లక్షలకుపైగా మైనార్టీ ఓటర్లున్నారు. దీంతో మొహిసిన్‌ షేక్‌ను యువసేన ఉప కార్యదర్శిగా నియమిస్తే లాభపడతామని శివసేన భావించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.   

చదవండి: BMC Polls 2022: నటులపై కాంగ్రెస్‌ దృష్టి, సోసూ పేరు కూడా

మరిన్ని వార్తలు