'48 గంటల తర్వాత ఏం చెప్పారో బాబుకే తెలియదు'

6 Aug, 2020 13:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామా పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారంటూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ కౌంటర్‌ దాఖలు చేసిన నేపథ్యంలో విశాఖలో మీడియాతో మాట్లాడారు.(48 గంటలు గడువిస్తున్నా)

ఆయన మాట్లాడుతూ.. 'రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రమే తేల్చి చెప్పింది. రాజధానిగా అమరావతిని ప్రకటించడంలో శివరామకృష్ణన్‌ కమిటీ పాత్ర లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు విధ్వంసకారిలా మారారు. రాజీనామాలపై చంద్రబాబుది వితండవాదం. ఏదైనా సమస్యపై పోరాటం చేయాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లాలి. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. 48 గంటల తర్వాత వచ్చి ఏం చెప్పారో చంద్రబాబుకే తెలియదు. చంద్రబాబు జిమ్మిక్కులు అందరికీ తెలుసు. మోసం చేయడం చంద్రబాబుకు ఉన్న పేటెంట్‌. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతారు.

విశాఖలో అభివృద్ధి జరగకూడదని చంద్రబాబు అంటుంటే... ఆ ప్రాంత టీడీపీ నేతలు పార్టీలో ఎలా కొనసాగుతారు. బాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేకపోయారు. కన్సల్టెంట్ల కోసమే రూ.348 కోట్లు దోపిడీ చేశారు. దమ్ముంటే బాబు, తన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. ఇచ్చిన ప్రతి మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకుంటున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుంది.. ఆ ప్రాంత రైతులకు మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది' అంటూ తెలిపారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్ర హోంశాఖ)

మరిన్ని వార్తలు