ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లారు
టీడీపీ నేతలను హోటల్లో కలుస్తున్నారు
మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న ఎన్నికల కమిషనర్ను ఎలా విశ్వసించగలమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖలో నిర్వహిస్తున్న బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుపై మంత్రి బొత్సతో పాటు ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం జీవీఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల రూ.3,200 కోట్లు ప్రజాధనం వృథాగా పోయిందన్నారు.
రాజకీయ పార్టీలను గానీ, ప్రభుత్వ అభిప్రాయాల్ని అడగకుండానే గతంలో ఎన్నికలు ఎలా రద్దు చేశారని నిమ్మగడ్డను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు వేలల్లో వస్తున్నప్పుడు నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఎన్నికల కమిషనర్ చెప్పాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూరు శాతం విజయం సాధిస్తామని బొత్స ధీమా వ్యక్తం చేశారు.