ఓ నేతపై ప్రజలు ఇంత భరోసా చూపడం దేశంలో ఇదే తొలిసారి
జగన్ పాలనను మెచ్చి ప్రజలు అఖండ విజయం అందించారు
మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ చరిత్ర, అద్భుతమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. నగర, పట్టణ ఓటర్లు మూకుమ్మడిగా సీఎం జగన్ పాలనకు పట్టం కట్టారన్నారు. మంత్రి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మేయర్, చైర్పర్సన్లు ఎవరనే దానిపై తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నిచేసినా ప్రజలు మనవైపే ఉన్నారని సీఎం చెప్పారు.. ఫలితాలు చూస్తే అది నిజమని తేలిందన్నారు. సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్ రూపొందించి ఎప్పుడేది ఇస్తున్నదీ చెప్పిన ప్రభుత్వం తమది కాబట్టే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలకు కారణమైన సీఎం జగన్ నాయ కత్వంలో పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. వైఎస్సార్ హయాంలో కూడా తాము భారీ సక్సెస్ సాధించామని, అయితే తండ్రిని మించిన తనయుడినని సీఎం జగన్ నిరూపించుకున్నారని బొత్స పేర్కొన్నారు.
అబ్బా కొడుకులు ఫలితం అనుభవిస్తున్నారు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అబ్బాకొడుకులైన చంద్రబాబు, లోకేశ్ అసభ్య పదజాలంతో రాజకీయం చేశారని, దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాయమా టలు చెప్పిన చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేయకుండా నిరాకరించారన్నారు. విజయవాడ, గుంటూరు అభివృద్ధికి గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అమరావతి పేరుతో దోచు కుతిన్నారని, ఒకే సామాజిక వర్గానికి మేలుచేసే ప్రయత్నం మాత్రమే చేశారన్నారు. విశాఖ స్టీల్ప్లాం ట్ ఆంధ్రులందరి హక్కు అని, దీన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి అన్నారు.