అచ్చెన్న వంటి వ్యక్తి సమాజానికి ప్రమాదకరం

6 Jun, 2022 05:11 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

టెక్కలి: పేదల ఆకలి తీరకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మెదడు లేదని విమర్శించారు.

వ్యక్తులు, వ్యవస్థలను నాశనం చేసే అచ్చెన్నాయుడు వంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని అన్నారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ ఉన్నారు.  

మరిన్ని వార్తలు