అవినీతిపై సవాళ్లు చేసి స్టేలతో పారిపోతారెందుకు?!

27 Sep, 2020 04:33 IST|Sakshi

పూర్వ పరిచయాలు, పలుకుబడితో కేసులను కోర్టుల్లో అడ్డుకుంటున్నారు 

విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా చేయడాన్ని అడ్డుకుంటున్నారు 

చంద్రబాబు తీరుపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం 

సాక్షి, అమరావతి: అవినీతిని వెలికి తీయండని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని పారిపోతున్నారెందుకని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. సాంకేతిక అంశాలు, తన పలుకుబడి, పూర్వ పరిచయాలతో చంద్రబాబు కోర్టుల్లో కేసులను అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధాని చేయడాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

► ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని చంద్రబాబు బాధపడుతున్నారు. 14 ఏళ్లు  సీఎంగా ఆయన ఈ ప్రాజెక్టులు చేపట్టలేక పోయానని ఒప్పుకోవాల్సింది పోయి జగన్‌ ఏడాదిన్నర లోపే ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నారు.  
► అమరావతి కుంభకోణంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ నిజాలు నిగ్గు తేలుస్తుంటే.. ఏ తప్పు చేయకపోతే మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరు స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు?   
► హిందూ దేవాలయాల మీద దాడి చేయిస్తున్నది, బయటకు వచ్చి అరుస్తున్నదీ.. ఒక్కరే అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ఈ దాడుల వెనుక కుట్రదారు టీడీపీ అని మేం అనుమానిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని  కోరాం. 
► సీఎం జగన్‌ భక్తి శ్రద్ధలతో తిరుమలలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే... హిందూ దేవాలయాల దాడుల వెనుక ఏదో చీకటి ఎజెండా ఉందని చంద్రబాబు అంటున్నారు. నిజమే ఆ ఎజెండా చంద్రబాబుదేనని ఆధారాలు దొరుకుతున్నాయి.    

మరిన్ని వార్తలు