మంత్రి బొత్స సత్యనారాయణ
నరసన్నపేట: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు గడిచిన నాలుగు రోజులుగా చేస్తున్న ప్రసంగాలు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా ఉన్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కర్నూలు సభలో ఆయన ప్రసంగం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు.
చంద్రబాబు సహనం కోల్పోయి చేస్తున్న ప్రసంగాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు గమనించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ రాక నేపథ్యంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి హత్యలు, దోపిడీలు జరిగాయో గుర్తు చేసుకోవాలి’ అంటూ హితవుపలికారు. సీఎం జగన్కు, ఆయన పాలనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని బొత్స చెప్పారు.