‘చంద్రబాబూ నమ్మకం ఉంటే.. మా సవాల్‌ స్వీకరించు’

3 Aug, 2020 19:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల మీద నమ్మకం ఉంటే.. చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. తన మీద తనకు నమ్మకం ఉంటే చంద్రబాబు వెంటనే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. మంత్రి బొత్స సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూస్తే.. ఆయనకు మతిస్థిమితం పూర్తిగా లేదని రూఢి అవుతోందని ఎద్దేవా చేశారు. (చదవండి : అబద్ధాలతో ఏమార్చడమే చంద్రబాబు అజెండా)

16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రజలు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇచ్చిన తీర్పు చంద్రబాబు ‘రాజధాని డిజైన్‌’కు చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు. చివరికి ఆయన కొడుకు నారా లోకేష్‌ని కూడా తుక్కు తుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరపాలని బాబు అంటున్నారు.. తనకు నమ్మకం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్‌ విసిరారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదు  48 గంటల్లోగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. (చదవండి : చంద్రబాబుకు మంత్రి అనిల్‌ సవాల్‌)

డీసెంట్రలైజేషన్‌ను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని విమర్శించారు. ఇక విశాఖ వెళ్ళే హక్కు చంద్రబాబుకు  లేదన్నారు.  సొంత ప్రాంతమైన రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తుంటే.. దాన్నికూడా వ్యతిరేకించి సొంత మామకే కాకుండా సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మూడు  రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు ఆ మూడింటిలో అమరావతి కూడా ఉందన్న విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇకపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో సాగనివ్వబోమని మంత్రి బొత్స హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు