‘వీళ్లంతా దండుపాళ్యం బ్యాచ్‌’.. కోమటిరెడ్డికి కౌంటర్‌

14 Feb, 2023 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందించి పొలిటికల్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. 

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. కాగా, జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‍కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని గెలిపించమని.. బీజేపీలో కాంగ్రెస్‌ను గెలిపించమని వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్‌ ఇచ్చారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్‌ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హంగ్‌ వచ్చే ఛాన్స్‌ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్‌ చేశారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్‌ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్‌ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని కేసీఆర్‌ టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్‌ ఇంకా.. ఈటల రాజేందర్‌ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్‌ అని సంచలన కామెంట్స్‌ చేశారు.’ అని అన్నారు. 

తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీ బీ టీమ్‌ కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్‌ఎస్‌ పార్టీ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. 

మరిన్ని వార్తలు