సాక్షి, బెంగళూరు : సీఎం పదవికి రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని, మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. 75 ఏళ్ల తర్వాత కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటా. గవర్నర్కు రాజీనామా ఇచ్చి ఆమోదించాలని కోరా. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తాం. నేను ఎవరి పేరును సిఫార్సు చేయలేదు. అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తా. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా’’నని అన్నారు.
కాగా, కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక నూతన సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్ ఉన్నారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. కర్ణాటక నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం ఉంది.