మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్‌ ముఖ్యమా..

10 Dec, 2022 01:17 IST|Sakshi
విద్యార్థిని కుటుంబ సభ్యులను  పరామర్శిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌   

బాలానగర్‌: సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్‌ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్‌ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

ఎంతోమంది పిల్లల భవిష్యత్‌ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్‌ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాలవర్ధన్‌గౌడ్, మండల కోఆర్డినేటర్‌ యాదయ్య తదితరులుఉన్నారు. 

మరిన్ని వార్తలు