బీఆర్‌ఎస్, బీజేపీ నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నాయి

3 Jan, 2023 02:29 IST|Sakshi
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌  

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రశ్నించే గళాలను అణచివేయడా నికి బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తు న్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ కుట్రల్లో భాగంగా తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆపిల్‌ సెల్‌ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నట్లు ఆ సంస్థ తనకు మెయిల్‌ పంపించిందని తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణను తట్టు కోలేక ప్రభుత్వాలు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే ఈ పనిచేస్తున్నాయని ఆరోపించారు.

కాగా, రైతుస్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు పల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని, పేదల భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుల సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు