రాష్ట్రంలో దౌర్జన్యకర పాలన

11 Dec, 2022 02:02 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌  

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 

ధన్వాడ: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. శనివారం ధన్వాడ మండలంలోని గున్ముక్లలో ఆయన పర్యటించి టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు.

ఆయన మాట్లాడుతూ.. ప్రతి గల్లీలో బెల్ట్‌షాపులు పెట్టి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రజలను వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాలని, తాము అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరాభూమి ఇస్తామని, బెల్ట్‌షాపులను పాలబూతులుగా మారుస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.  

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్‌ కుటుంబీకులను ప్రవీణ్‌కుమార్‌ పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు