సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ తనను నమ్మి ఓట్లు వేసిన రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేసముద్రం మార్కెట్లో హమాలీలతో కలిసి ఆయన బస్తాలు మోశారు.
పేదల ఇళ్లల్లోకి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రుణమాఫీ చేస్తామని ప్రకటించారే తప్ప ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం పంజాబ్కు వెళ్లి అక్కడ డబ్బులు పంచిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే పగటి కలలు కంటూ దేశమంతా తిరుగుతున్నారని ప్రవీణ్ ఎద్దేవా చేశారు.