77మంది మంత్రులతో మోదీ నూతన కేబినెట్‌

7 Jul, 2021 20:11 IST|Sakshi

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణ పూర్తయ్యింది. 43 మంది కొత్తవారి ప్రమాణస్వీకారం అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్‌ కొలువు దీరింది. కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 36 మందికి చోటు దక్కగా.. 30 మందికి కేబినెట్‌ హోదా దక్కింది. బుధవారం జరిగిన కేబినెట్‌ విస్తరణలో ఏడుగురు పాతవారికి, కొత్తగా 8 మందికి కేబినెట్‌ హోదా దక్కింది. పాతవారిలో కిషన్‌రెడ్డి, హర్దీప్‌సింగ్‌ పూరి, ఆర్కే సింగ్‌, అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజుకు కేబినెట్‌ హోదా దక్కింది. గతంలో వీరు సహాయ మంత్రులుగా పని చేశారు. 

ఇక కేబినెట్‌లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్‌ నుంచి నలుగురు చొప్పున కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కగా..  గుజరాత్‌ నుంచి ముగ్గురికి, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి ఇద్దరు చొప్పున చోటు దక్కించుకున్నారు. అసోం, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, త్రిపుర, మణిపూర్‌, తమిళనాడు నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కిషన్‌ రెడ్డికి మాత్రమే చోటు దక్కింది. ఆయనకు పదోన్నతి లభించింది.

మరిన్ని వార్తలు