తప్పు చేసి.. నీతులు చెప్తావా బాబూ! 

15 Jan, 2022 08:33 IST|Sakshi

దోపిడీ, హత్య కేసులో నిందితుడి పాడె మోసిన చంద్రబాబు

జైలు జీవితాన్నీ అనుభవించిన చంద్రయ్య

బాబు చర్యపై పెదవి విరుస్తున్న పల్నాడువాసులు, టీడీపీ నేతలు

వెల్దుర్తి (మాచర్ల)/గుంటూరు జిల్లా: దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడికి జేజేలు పలికి, అతని పాడె మోసిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందని పల్నాడువాసులు విమర్శిస్తున్నారు. రక్త సంబందీకులు మృతి చెందిన సమయంలో సైతం ఏనాడూ పాడె మోయని చంద్రబాబు.. దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడైన తోట చంద్రయ్య పాడెను మోయటంపై టీడీపీలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అంతటితో ఆగకుండా ఈ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.  పలు రకాల నీతులు మాట్లాడారు.  దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురైతే, విపక్ష నేత పరుగు పరుగున రావడమే ఓ వింత అయితే.. అతని పాడె మోయడం, నీతులు వల్లించడం మరింత విస్తుగొలుపుతోందని టీడీపీ నేతలే అంటున్నారు. తప్పు చేసి.., తానెప్పుడూ హత్యలను ప్రోత్సహించలేదని కూడా బాబు చెప్పడం హాస్యాస్పదమంటున్నారు.

చదవండి: పచ్చని పల్నాడులో చిచ్చు పెడుతున్నారు 

డబ్బులు గుంజుకుని రైల్లోంచి తోసేశారు
వ్యక్తిగత కక్షలతో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్య గురువారం హత్యకు  గురవడం తెలిసిందే.  చంద్రబాబు హడావుడిగా  చంద్రయ్య కుటంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పాడెను మోశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. గుండ్లపాడుకు చెందిన మిరపకాయల వ్యాపారి సాని పేరయ్య ఇక్కడి మిర్చిని కొని గుంటూరు యార్డుకు తీసుకెళ్లి విక్రయించేవాడు. 20 ఏళ్ల క్రితం పేరయ్య ఓ రోజు ఇలానే మిర్చి అమ్మిన డబ్బులతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండటాన్ని గమనించిన చంద్రయ్య, మరో ఇద్దరు పేరయ్యను కలిశారు.

స్వగ్రామానికి రైలులో కలిసి వెళ్దామని చెప్పడంతో  వారితో రైలెక్కిన పేరయ్యపై రైలులోనే దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న డబ్బును లాక్కుని విషయం బయట పడుతుందన్న ఆందోళనతో పేరయ్యను సత్తెనపల్లి, పిడుగురాళ్ళ మధ్య రైలు నుంచి తోసేశారు. నడుస్తున్న రైలు నుంచి కింద పడి పేరయ్య మృతిచెందాడు. వీరు తరువాత స్టేషన్‌లో దిగి వెనక్కి వెళ్ళి మృతదేహాన్ని మాయం చేశారు. ఏమీ తెలియనట్లే గ్రామంలో తిరగసాగారు.

అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పేరయ్య హత్యను చూశాడు. ఆరు నెలల తరువాత ఈ విషయాన్ని పేరయ్య కుమారుడు బ్రహ్మయ్యకు చెప్పాడు. దీంతో చంద్రయ్యతో పాటు మరో ఇద్దరిని నిలదీయగా వారు నేరం ఒప్పుకున్నారు. పేరయ్య బంధువులు వీరికి సగం గుండు, సగం మీసంతో గాడిదపై ఊరేగించారని సమాచారం.   బ్రహ్మయ్య పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో  చంద్రయ్య, మరో ఇద్దరిపై డెకాయిటీ, హత్య కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా, జైలు జీవితాన్ని అనుభవించారు. చంద్రయ్యపై గతంలో నమోదైన కేసుపై మాచర్ల రూరల్‌ సీఐ సురేంద్రబాబును వివరణ కోరగా విచారిస్తానన్నారు. 

మరిన్ని వార్తలు