ప్రజలు నన్ను అర్థం చేసుకోలేకపోయారు

31 May, 2021 04:50 IST|Sakshi

నేను ఏం తప్పు చేశానో అర్థం కావడంలేదు: చంద్రబాబు

మంచిని అర్థం చేసుకోలేని ప్రజలుంటే ఏంచేయగలం

అయినా 2024లో గెలుపు టీడీపీదే

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు తనను అర్థం చేసుకోలేకపోయారని, అర్థం చేసుకుంటారని అనుకున్నానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. న్యూజిలాండ్‌ టీడీపీ మహానాడు పేరుతో హైదరాబాద్‌ నుంచి ఆదివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పలువురు ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడారు. ప్రజలు తనను అర్థం చేసుకోకపోవడం వల్ల తనకు నష్టం రాలేదని, ప్రజలే నష్టపోయారని చెప్పారు. అభివృద్ధి చేయలేదా అంటే చేశామన్నారు. ఎక్కడ తప్పు చేశానో తనకు ఇప్పటికీ అర్థం కావడంలేదన్నారు.

మంచిని అర్థం చేసుకోలేని ప్రజానీకం ఉంటే ఏం చేయగలుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అవినీతి చేసిన వ్యక్తిని సరిగా విశ్లేషించలేని ప్రజానీకం ఉన్నప్పుడు తమకు బాధలు తప్పవన్నారు. తమ వాళ్లు అందరూ బాధపడుతున్నారని, తనను మారాలంటున్నారని, కానీ దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని నిర్వేదం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నూటికి నూరు శాతం గెలుస్తుందని, ఇందులో అనుమానం అవసరం లేదన్నారు. ఎన్నికలు ముందు జరిగినా గెలుస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు