ఆంధ్రా పేపర్‌ను అమ్మిందెవరు? ఆల్విన్‌ గొంతు నులిమిందెవరు?

17 Feb, 2021 03:47 IST|Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణను ఉద్యమంలా నడిపిన చంద్రబాబు

షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు, డెయిరీల వంటి మొత్తం 54 ప్రభుత్వరంగ సంస్థలు బలి

ఇప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకి అన్నట్టుగా డ్రామాలు 

‘విశాఖ ఉక్కు’పై టీడీపీ అధినేత మొసలి కన్నీరు

సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగం స్వాధీనం చేసుకోవాలి. వాటిని కేవలం వాణిజ్య పరంగానే నడపాలి. ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తాం. ప్రైవేటీకరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించాం. రాబోయే కాలంలో దీన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాం. ప్రైవేటీకరణే తారకమంత్రం. ప్రైవేటీకరణలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది..’ ఇదీ.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన ‘ప్రైవైటైజేషన్‌– ఏ సక్సెస్‌ స్టోరీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే పుస్తకంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాసిన ముందుమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999–2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణపై తన కలలు, ఏంచేశాను, ఏంచేయాలనే అంశాలను ఆయన చాలా విపులంగా అందులో వివరించారు. ఆ ఐదేళ్లలో చంద్రబాబు ఆంధ్రా పేపర్‌ మిల్లు సహా అనేక షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు ప్రైవేటు పరం చేశారు. ఆల్విన్‌ వాచ్‌ సహా అనేక సంస్థల్ని మూసివేశారు. మరెన్నో సంస్థలను నిర్వీర్యం చేసేశారు. 

అమ్మకానికి ముద్దుపేరు సంస్కరణలు
ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే కార్యక్రమానికి ఆయన ముద్దుగా సంస్కరణలు (ఏపీ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రిఫామ్స్‌) అనే పేరు పెట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని అయినకాడికి అమ్మేయడమే ఈ సంస్కరణల లక్ష్యం. అమ్మడం కుదరని వాటిని మూసివేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను  వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక సెక్రటేరియేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సెక్రటేరియేట్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం, ప్రైవేటుపరం చేయడాన్ని ఒక ఉద్యమంలా నడిపించారు. సంస్కరణల పేరిట 1999 నుంచి 2004 మార్చి నాటికి రెండు దశల్లో మొత్తం 54 ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ/ పెట్టుబడుల ఉపసంహరణ, ఏకంగా మూసివేత వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించారు.

2006–07 నాటికి 87 సంస్థల్ని ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో అవి బతికిపోయాయి. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా కనిపించేది కాదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ బ్యాంకు సూచనలు, షరతుల ప్రకారం చంద్రబాబు లక్షలాది మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ పేరుతో ఇంటికి పంపించారు. అప్పట్లో చంద్రబాబుకు ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే పేరు రావడం గమనార్హం. ఇంత చేసిన చంద్రబాబు ఇప్పుడు ‘విశాఖ ఉక్కు’ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ అప్పటి చంద్రబాబు నిర్వాకం
మొదటి దశలో 19 ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. 8 సంస్థల్ని ప్రైవేటీకరించారు. 6 సంస్థలు మూసేశారు. 4 సంస్థల కోరలు పీకి నిర్వీర్యం చేశారు. ఇక రెండో దశలో 68 సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో 12 సంస్థల్ని ప్రైవేటీకరించారు. ఏకంగా 16 సంస్థల్ని మూసివేశారు. 8 సంస్థలకు జవసత్వాలు లేకుండా చేశారు. 

రెండో దశలో ప్రైవేటీకరించిన సంస్థలు 
1. పాలెయిర్‌ కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, 2. వెస్ట్‌ గోదావరి కో–ఆపరేటివ్‌ షుగర్‌ మిల్లు 3. ఎన్‌వీఆర్‌ కో–ఆపరేటివ్‌ షుగర్‌ మిల్లు, జంపని, 4. రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్, అనకాపల్లి, 5. రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్, చీపురుపల్లి, 6. వోల్టాస్‌ లిమిటెడ్, 7. గోదావరి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్, 8. వజీర్‌ సుల్తాన్‌ టుబాకో (వీఎస్‌టీ), 9. టాటా మోటార్స్‌ (గతంలో టెల్కో), 10. అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీ (ఏసీసీ), 11. సిర్పూర్‌ పేపర్‌ మిల్స్, 12. ఆంధ్రప్రదేశ్‌ పేపర్‌ మిల్స్‌

మూసివేసిన సంస్థలు:
1. ఎన్‌రిచ్‌ 2. ఫెడ్‌కాన్‌ 3. ఏపీ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 4. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 5. శ్రీకృష్ణదేవరాయ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ యూనియన్‌ 6. శ్రీ విజయవర్థని ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ యూనియన్‌ 7. ఏపీ స్పిన్‌ఫెడ్‌ 8. కరీంనగర్‌ కో–ఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ 9. ఏపీ షుగర్‌ఫెడ్‌ 10. చిత్తూరు డిస్ట్రిక్ట్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ 11. శ్రీ రాజరాజేశ్వరి కో–ఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ 12. రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్, ఆత్మకూర్‌ 13.రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్‌ రాయచోటి, 14.రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్‌ కదిరి ఈస్ట్, 15.రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్‌ కదిరి వెస్ట్, 16.రూరల్‌ ఎలక్ట్రిసిటీ సప్‌లై కో–ఆపరేటివ్‌ జోగిపేట

నిర్వీర్యం చేసిన సంస్థలు:
1. ఏపీ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 2. గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ 3. ఆప్కో 4. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ 5. నెడ్‌క్యాప్‌ 6. ఏపీ ఫిల్మ్‌ థియేటర్‌ అండ్‌ టెలివిజన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 7. ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 8. ఏపీ సెరీఫైడ్‌.

ప్రైవేటీకరించిన సంస్థలు: 
1. శ్రీ హనుమాన్‌ సహకార చక్కెర కర్మాగారం 2. ఏఎస్‌ఎం సహకార చక్కెర కర్మాగారం 3. ఆదిలాబాద్‌ సహకార స్పిన్నింగ్‌ మిల్లు 4. రాజమండ్రి సహకార స్పిన్నింగ్‌ మిల్లు, 5. నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌తో పాటు దాని పరిధిలో ఉన్న చాగల్లు డిస్టిలరీ, శంకర్‌నగర్‌ షుగర్‌ మిల్లు, మాంబోజిపల్లి షుగర్‌ మిల్లు, మెట్‌పల్లి షుగర్‌ మిల్లు, లచ్చయ్యపేట షుగర్‌ మిల్లు, మధునగర్‌ షుగర్‌ మిల్లు, మాంబోజిపల్లి డిస్టిలరీ 6. నంద్యాల కో–ఆపరేటివ్‌ షుగర్‌ మిల్లు 7. నాగార్జున కో–ఆపరేటివ్‌ షుగర్‌ మిల్లు 8. పర్చూర్‌ కో–ఆపరేటివ్‌ షుగర్‌ మిల్లు

మూసేసిన సంస్థలు
1. ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, 2. ఏపీ టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, 3. ఆల్విన్‌ వాచెస్‌ లిమిటెడ్, 4. నెల్లూరు కో–ఆపరేటివ్‌ స్పినింగ్‌ మిల్లు 5. చీరాల కో–ఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్లు 6. చిలకలూరిపేట కో–ఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్లు

నిర్వీర్యం చేసిన సంస్థలు
1. ఏపీ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, 2. ఏపీ స్టేట్‌ మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, 3. ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, 4. ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌. 

మరిన్ని వార్తలు