కోర్టుల ద్వారా పనిష్మెంట్లు ఇప్పిస్తా!

5 Dec, 2020 04:27 IST|Sakshi

అన్నీ లెక్కిస్తున్నా.. పోలీసులూ జాగ్రత్త: చంద్రబాబు

సాక్షి, అమరావతి: పోలీసులకు కోర్టుల ద్వారా పనిష్మెంట్లు ఇప్పిస్తామని, జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. తాను ఇంతకుముందులా ఉండనని, అన్నీ లెక్కలు వేసుకుంటున్నానని, ఎప్పుడు అవకాశం వచ్చినా ఎవరినీ వదలనని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్రను వేధిస్తున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా తమ పార్టీ నాయకులకే ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 నెలల్లో ఏం చేశారో చెప్పుకునే సత్తా లేక ఐదు రోజులు తమ సభ్యుల్ని సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి తాము లెక్కలు సరిగా చెబుతున్నామని, అధికారంలో ఉండి వైఎస్సార్‌సీపీ తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. 

పెండింగ్‌ ఉపాధి బిల్లులు చెల్లించాలని టీడీపీ పాదయాత్ర
వెలగపూడి (తాడికొండ): పెండింగ్‌లో ఉన్న రూ.2,500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. 

మరిన్ని వార్తలు