చినబాబును ప్రమోట్‌ చేయాలంటూ చంద్రబాబు ఒత్తిడి

11 Apr, 2021 08:58 IST|Sakshi

చినబాబును ప్రమోట్‌ చేయాలని సీనియర్లపై ఒత్తిడి

లోకేష్‌ సవాళ్లకు స్పందించాలని అధికార పార్టీని డిమాండ్‌ చేస్తున్న నేతలు

అచ్చెన్నాయుడు, అయ్యన్నదీ అదే తీరు

ఇష్టం లేకపోయినా తప్పక అదే పని చేస్తున్న వైనం

జాకీ వేసి లేపినా వరుస తప్పులతో పరువు తీస్తున్నారని ఆందోళన

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి తనయుడు లోకేష్‌ను ప్రమోట్‌ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఏదో ఒకలా ఆయన్ను మీడియాలో హైలైట్‌ చేసి ప్రజల్లో ఆదరణ పెంచాలని కొంత కాలంగా పార్టీ సీనియర్లు, మీడియా, సోషల్‌ మీడియా బృందాలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిసింది. అందుకే లోకేష్‌ వ్యాఖ్యలపై స్పందించాలని ఇటీవల ముఖ్య నాయకులు మీడియా సమావేశాలు పెట్టి.. సీఎం, అధికార పార్టీ నాయకులను డిమాండ్‌ చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న లోకేష్‌.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీఎం జగన్‌కు ఒక సవాలు విసిరారు. దానిపై మరుసటి రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మరీ సీఎం స్పందించాలని కోరారు. ఏదైనా అంశంపై ఆయన మాట్లాడకుండా లోకేష్‌ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్‌ చేయడం కోసమే మీడియాను పిలవడం విశేషం.

మరో ముఖ్య నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇలాగే మీడియా సమావేశం నిర్వహించి లోకేష్‌ సవాలుకు సీఎం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇంకా పలువురు నాయకులు మీడియా సమావేశాలు, ట్వీట్లు, ప్రకటనల ద్వారా ఈ డిమాండ్‌ చేశారు. ఒకే రోజు ముఖ్య నాయకులంతా లోకేష్‌ సవాలుకు స్పందించాలని ముక్త కంఠంతో కోరడం వెనుక ఆయన్ను ఎలాగైనా ప్రమోట్‌ చేయాలనే బలమైన ఒత్తిడి ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ఎటువంటి ప్రయోజనం కనిపించకపోగా, లోకేష్‌ ఏదో తప్పులో కాలేసి నవ్వుల పాలవుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది.

‘జూనియర్‌’ డిమాండ్‌తో పెరుగుతున్న ఒత్తిడి 
స్థానిక ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తుండడంతో చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఒత్తిడితోనే తన కొడుకును ప్రమోట్‌ చేయాలని ఆయన సీనియర్లపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నాయకులంతా వరుసగా లోకేష్‌ గురించే మాట్లాడడం మొదలు పెట్టారు. తిరుపతి ప్రచారంలో లోకేష్‌ ఇమేజ్‌ పెంచాలని రకరకాల ట్రిక్‌లు వాడినా, ఆయన తప్పులు, తింగరి మాటలతో అవి రివర్స్‌ అవుతున్నాయని ఆ పార్టీ సోషల్‌ మీడియా బృందాలు వాపోతున్నట్లు తెలిసింది.

సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆయన స్పందిస్తారని, లేకపోతే పార్టీ నాయకులు స్పందిస్తారని, దీంతో తన ఇమేజ్‌ పెరుగుతుందనే అంచనాతో ఇటీవల లోకేష్‌ అదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సూటిగా మాట్లాడలేక తప్పులు మాట్లాడడం, ట్వీట్లలోనూ పెడార్థాలు తీయడంతో అవన్నీ రివర్స్‌ అవుతున్నాయని పార్టీ నాయకులు వాపోతున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ సోషల్‌ మీడియా, ఓ వర్గం మీడియా చినబాబును జాకీలేసి లేపేందుకు అదే పనిగా ప్రయత్నిస్తూ కిందామీదా పడుతోంది.

చదవండి: ‘ఏడాదిలోనే హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది’

మరిన్ని వార్తలు