లోకేష్, బాలకృష్ణ భూములు కొన్నారు

15 Sep, 2020 15:36 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రాజధాని పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన బినామీలు జైలుకు వెళ్లక తప్పదని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారని.. చట్టాలను ఉల్లంఘించి భూములు కొన్న టీడీపీ నేతలు ఇప్పుడు జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు తోపాటు ఆయన తనయుడు లోకేష్, బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు. ప్రతి కుంభకోణంలో స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇపుడు ఏసీబీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడైనా స్టేలు తెచ్చుకోకుండా తన నిజాయితీని నిరూపించుకోవాలని చంద్రబాబుకు ఆర్కే రోజా సూచించారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది: మంత్రి చెల్లుబోయిన
తూర్పు గోదావరి జిల్లా : రాజధానిలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని మంత్రివర్గ ఉప సంఘం కూడా నిర్ధారించిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, అప్పుడే వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని అభిప్రాయపడ్డారు. బినామీ పేర్లతో టీడీపీ నాయకులు రాజధానిలో భూములు కాజేశారని.. అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. (చదవండి: 'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది')

మరిన్ని వార్తలు