పేదల పక్షాన నిలబడటం తప్పా?

17 Dec, 2022 05:32 IST|Sakshi

చంద్రబాబు, ఎల్లో మీడియాపై మంత్రి చెల్లుబోయిన ధ్వజం

బాబు హయాంలో 3.15 లక్షల మంది బీసీలకు రూ.1,626 కోట్ల రుణం

ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.1.64 లక్షల కోట్ల ప్రయోజనం  

నాడు బీసీలను రుణగ్రస్తులను చేయాలనే పెత్తందారి పోకడ  

నేడు ఈ ప్రభుత్వంలో వారిలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఆరాటం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబడుతుండటం చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయానికి, అందులోని పెత్తందారీ ‘ఈనాడు’ రామోజీరావుకు కంటగింపుగా మారిందని బీసీ సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మూడున్నరేళ్లలో సంక్షేమ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ), నాన్‌ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.3.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేకూర్చితే అందులో బీసీలకు రూ.1.64 లక్షల కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. 2014 ఎన్నికల్లో బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఏటా రూ.పది వేల చొప్పున రూ.50 వేలు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా మోసం చేస్తే కమ్మగా కన్పించిందా? అని రామోజీరావును నిలదీశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం?
► టీడీపీ సర్కార్‌ హయాంలో కార్పొరేషన్ల ద్వారా 3.15 లక్షల మంది బీసీలకు రూ.1,626 కోట్ల రుణం ఇచ్చారని ‘ఈనాడు’లోనే ప్రచురించారు. ఈ మూడున్నరేళ్లలోనే సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు 5.05 కోట్ల  ప్రయోజనాలు చేకూరుస్తూ రూ.1.64 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం?

► పెత్తందారి చంద్రబాబు బీసీలను రుణగ్రస్తులుగా మార్చితే.. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలలో పేదరికాన్ని నిర్మూలించి, అభివృద్ధి చేస్తున్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి కేబినెట్‌ వరకు పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించారు. ఇదంతా రామోజీరావుకు కనిపించదా?

► బీసీ వర్గాలకు చెందిన 139 కులాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి.. 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి.. వాటికి చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించి, సంక్షేమ పథకాల ఫలాలు ఆ వర్గాలకు దక్కేలా చేస్తుంటే ఎల్లో మీడియా వంకర రాతలు రాస్తోంది. వాటిని బీసీలు విశ్వసించరు. 

► 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా అన్యాయం చేసినప్పుడు మీ పాత్రికేయ విలువలు ఏమయ్యాయి? ఈ రోజు సీఎం జగన్‌.. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపడం కన్పించలేదా? బీసీలను 11 తరాలు వెనక్కి నెట్టి, రాజకీయంగా దివాళా తీసిన చంద్రబాబును పైకి ఎత్తేందుకు ఎన్ని తప్పుడు రాతలు రాసినా ప్రయోజనం ఉండదు. 

మరిన్ని వార్తలు