కమల్ హాసన్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

20 May, 2021 17:44 IST|Sakshi

చెన్నై : త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన క‌మ‌ల్ హాస‌న్‌ హాసన్‌ మక్కల్‌ నీధి మయ్యమ్‌(ఎంఎన్‌ఎం)పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడుతో సహా కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి సీకే కుమారవేల్‌ చేరారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా ఉన్న సీకే కుమారవేల్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీ  వ్యూహత్మక బృందం తప్పుడు విధానాలను అవలంభించిందని ఆయన ఆరోపించారు.

‘‘వ్యక్తిపూజకు ఆస్కారం లేదు. లౌకికవాద ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేను ప్రయాణించాలనుకుంటున్నా.. మేము చరిత్రను సృష్టించాల్సింది. కానీ,  చరిత్రను చదువుతున్నాం’’ అని కమల్‌కు కుమార్‌వేల్ చురకలంటించారు. ఎంఎన్ఎం ఉపాధ్యాక్షుడు ఆర్ మహేంద్రన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబులు రాజీనామా చేయగా.. చెన్నైలోని ఓ స్థానం నుంచి పోటీచేసిన పర్యావరణ కార్యకర్త పద్మ ప్రియ సైతం వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అలాగే నిన్న(బుధవారం ) మరో నేత ఎం మురుగానందమ్ రాజీనామా చేశారు. 

కాగా మే 2న తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కమల్పా‌ ర్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు పార్టీని వీడారు. తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. కోయంబత్తూరు దక్షిణ నుంచి పోటీచేసిన ఆయన కూడా ఓటమిపాలయ్యారు.

చదవండి: 
కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్‌ హాసన్‌ 

కేరళ సీఎంగా పినరయి విజయన్‌ ప్రమాణస్వీకారం

మరిన్ని వార్తలు