‘కేసీఆర్‌ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’

5 May, 2021 18:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క‌రోనా వైరస్‌తో రాష్ట్ర‌ం అత‌లాకుత‌లమవుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. క‌రోనా బాధిత‌లు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని తెలిపారు.  బెడ్లుంటే ఇంజెక్షన్ లేదు.. ఇంజెక్షన్ ఉంటే ఆక్సిజన్ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సింది పోయి.. అర్ధాంతరంగా ఆరోగ్య మంత్రిని తీసేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘టెస్టులు లేవు.. కరోనా వ్యాక్సిన్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. సీఎం దగ్గర శాఖ పెట్టుకుని ఏం సమీక్ష చేశారు?. సభలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చుతా అని మాటిచ్చి మరిచిపోయారు. ఏడాది కిందట సీఎంం వేసిన టాస్క్‌ఫోర్స్ ఉందా..? పని చేస్తుందో ఎవరికి తెలియదు. టాస్క్‌ఫోర్స్ ప్రతిపక్షాలకు కూడా నివేదిక ఇస్తుంది అన్నారు సీఎం. ఇప్పటివరకు మాకైతే నివేదిక ఇవ్వలేదు.’ అని తెలిపారు.

ఇక సీఎం కేసీఆర్‌ తీరుపై భట్టి మండిపడ్డారు. ‘పోలియో వ‌స్తే మా ప్రభుత్వం వెంటపడి పోలియో చుక్కలు వేసిందని. మీలాంటి సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రధాని అయితే... దేశంలో సగం మంది వైకల్యంతో ఉండేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు నువ్వు బయటకు రా... ప్రజల పరిస్థితి అర్దం చేసుకో అని సూచించారు. చీఫ్ సెక్రెట‌రీ అన్నీ ఉన్నాయ‌ని అంటున్నారని, రా ఆసుపత్రులు తిరుగుదామని సవాల్‌ విసిరారు. బాధ్యత గలిగిన అధికారి అబద్ధాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అన్ని బాగుంటే ఖమ్మంలో ఆస్పత్రి ఎదుట అంబులెన్స్లు ఎందుకు వెయిటింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

జనం సొమ్ముతో జీతాలు తీసుకునే మీరు... ప్రజలు సేవ చేయకుండా ఏం చేస్తున్నారని భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రభుత్వానికి మేము సహకరించడానికి సిద్ధమని ప్రకటించారు. సీఎం ముందు వచ్చి... అన్ని పార్టీలను కలుపేసుకుని పో అని సూచించారు. కరోనా మీద కలిసికట్టుగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం అపాయిట్‌మెంట్‌కి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చి ఇబ్బంది పెట్టకండి అని హితవు పలికారు. గవర్నర్ అపాయింట్‌మెంట్‌ అడిగామని చెప్పారు. వెంటిలేటర్లు ఉన్న చోట టెక్నీషియన్లు లేరు అని ఆరోపించారు. ఏడాది కిందటే ఉద్యోగుల భర్తీ చేయండి అని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజులు ఫైనల్ చేయండి అని విజ్ఞప్తి చేశారు. జలగల్ల రక్తం పీల్చుకు తాగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: పెళ్లి వాయిదా వేస్కోండి ప్లీజ్‌.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి

చదవండి: కరోనా వివాహం.. నిజంగంటే ఇది బొంగుల పెళ్లి..

మరిన్ని వార్తలు