ఆ పాపం కేసీఆర్‌దే: భట్టి విక్రమార్క ఆగ్రహం

25 Jun, 2021 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగుగంగ ప్రారంభమైందని.. అప్పుడు కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని.. ఆ సమయంలో తెలంగాణ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. జనంలో ఇప్పుడు కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోయిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ఇలా ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క శుక్రవారం మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కృష్ణ, గోదావరి నీళ్ళును పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలనే మన ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ రెండు నదులపై కేసీఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోతిరెడ్డి పాడు పాపం... కేసిఆర్‌దే..
‘‘1985-86 ప్రాంతంలో  ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు నువ్వేం చేశావు. ఆనాడు కరువు మంత్రిగా ఉన్న కేసీఆర్..  పోతిరెడ్డిపాడుకు నాంది పలికాడు. దానికి ఆయనే బాధ్యుడు.  మీ నాయకత్వంలోనే పోతిరెడ్డిపాడు మొదలైంది. దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక్క టీఎంసీ లెక్కన  15 టీఎంసీలు చెన్నై నగరానికి తాగునీళ్లు తీసుకునిపోయే పోతిరెడ్డిపాడును మొదలు పెట్టిందే మీరు. ఓపెన్ కెనాల్ పెట్టడం వల్లే వాళ్లు రిజర్వాయర్లు పెట్టి నీళ్లు తోడుకోవడం, ఇంత అడ్డగోలుగా నీళ్లు తీసుకెళ్లడం జరిగేది కాదు. అప్పుడు మంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్టి ధ్వజమెత్తారు.

పాపం కేసీఆర్ చేసి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌పై నిందలా?
‘‘కృష్ణా నదిపై కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు - రంగారెడ్డి, డిండి మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ కొన్ని వేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకూ కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?? కొత్త ప్రాజెక్టులతో కేసీఆర్ నీళ్లు ఇవ్వకపోగా.. గత ప్రాజెక్టులు కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో 3.4 లక్షల ఎకరాలు, ఎస్సెల్బీసీ ఎఎంఆర్ తో 3.7 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు,  మొత్తం 9 లక్షల 10 వేల ఎకరాలు. వీటితో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 6 లక్షల 40 వేల ఎకరాలు15 లక్షల 50 వేల ఎకరాలకు కేసీఆర్ రాకముందే నీళ్లు ఇచ్చాయి. 

భావోద్వేగాలు రెచ్చ గొట్టి .. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తప్పంతా కేసీఆర్‌దే. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏడాది పాటు ఆగి ఇప్పుడు... మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన రోజే మాట్లాడేవారు.  ఏడాది వరకూ ఎందుకు మాట్లాడలేదు. పాపం మీరు చేసి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై నిందలా’’ అని భట్టి.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

చదవండి: Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్‌ఎస్‌, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్‌ ఎందుకిలా!

మరిన్ని వార్తలు