గుజరాత్‌లో పోటీ చేస్తాం: సీఎం ప్రకటన

14 Jun, 2021 13:30 IST|Sakshi

అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయంగా కీలక ప్రకటన చేశారు. ఆయన సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022లో గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థులు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలబడతారని పేర్కొన్నారు. ఈ ఏడాది సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆప్‌ 120 స్థానాల్లో పోటీ చేసి 27 సీట్లలో విజయం సాధించింది. ఆ ఎన్నికల అనంతరం కేజ్రీవాల్‌ రెండోసారి గుజరాత్‌తో పర్యటించారు.

ఇక కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆప్‌ గుజరాత్‌లోని స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేజ్రీవాల్‌ ఆశ్రమ్‌రోడ్డులోని ఆప్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పర్యటన ముగించుకొని సోమవారమే సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ వెల్లనున్నారని ఆప్‌ అధికార ప్రతినిధి తులి బేనర్జీ తెలిపారు. ఆదివారం గుజరాత్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ ఇసుదాన్ గాద్వి సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలో ఆప్‌లో చేరిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ ప్రకటనతో గుజరాత్‌ రాజకీయలపై ఆసక్తి నెలకొంది.
చదవండి: ప్రాణభయం అన్నాడు.. గంటల వ్యవధిలో శవమై కనిపించాడు

మరిన్ని వార్తలు