ఏ నోటితో రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని అడుగుతారు: సీఎం కేసీఆర్‌

28 Apr, 2022 08:35 IST|Sakshi

పన్నులు పెంచేది మీరు..తగ్గించేది మేమా?

ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌:     దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగింపులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రాలు పన్నులు తగ్గించాలంటూ మోదీ మాట్లాడారు. ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా అవి? సిగ్గూ ఎగ్గూ ఉందా? ఏ నోటితో అలా మాట్లాడుతున్నావ్‌? పెంచేది మీరు..తగ్గించేది మేమా? తెలంగాణ ఏర్పడ్డ తరువాత పెట్రోల్, డీజిల్‌ మీద మేం పన్నులు పెంచలేదు.

ఒకేసారి రౌండ్‌ ఫిగర్‌ చేయడానికి సర్దుబాటు చేశాం. కానీ ప్రధానమంత్రి కుటిల, దుష్ట రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పకుండా లోగుట్టుగా పన్నులు పెంచుతున్నారు. ‘‘బలమైన కేంద్రం– బక్క రాష్ట్రం’’అనే ధోరణిలో ఉన్నారు. పన్నులు ఎందుకు పెంచుతున్నామో ప్రజలకు చెప్పాలి. మేము రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎందుకు పెంచుతున్నామో చెప్పి పెంచినం. నువ్వు పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరల వల్ల కునారిల్లుతున్న ఆర్టీసీని బతికించేందుకు మేం వేల కోట్లు వెచ్చిస్తున్నం. ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్లు ఇస్తామన్న ఘనుడు ప్రధానమంత్రి..’అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.    

చదవండి👉 గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు.. కరోనా టైంలో శవాలు తేల్చారు: కేటీఆర్‌

మరిన్ని వార్తలు