దేశానికి కావాల్సింది రాజకీయ ఎజెండా కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా: ప్లీనరీలో సీఎం కేసీఆర్‌

27 Apr, 2022 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి కావాల్సింది బీజేపీని గద్దె దించడమో, రాజకీయ ఎజెండానో కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ హెచ్‌సీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. 

► భారత దేశం శాంతికి అలవమైన సమాజం. కానీ, అవసరమైన జాఢ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంత అద్భుతమైన దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు.. దేశ గరిమకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి. మంచి మార్గాలు కనిపించడం లేదు. అందుకే  ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు.  

► తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. 

► తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఈ మాట కాగ్‌, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్‌ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి. 

► పరిష్కారాలు కనబర్చాల్సింది విపరీతంగా ఉన్న సమస్యల మీద. ప్రపంచంలోనే యువ జనాభా ఉన్న దేశం భారత్‌.. కానీ, దరిద్రమే తాండవిస్తోంది. ప్రతిభాపాటవాలను విదేశాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అద్భుతంగా పురోగమించాల్సిన దేశం.. వెనుకబడి పోతోంది. మట్టిని కూడా సింగపూర్‌ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే నీతి ఆయోగే ఖండించేది కదా.

► అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

► కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలనని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

అందరికీ రేషన్‌ బియ్యం ఇచ్చినందుకే ఓటేయాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కోరాడు. ఇదా పరిస్థితి?.

దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్‌ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్‌ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్‌. 

దేశంలో అనారోగ్యమైన వాతావరణం నెలకొంది. రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని, రాజకీయ పునరేకీరణ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

నూతన వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. ప్రతీ ఒక్కరికీ పని చేసే అవకాశం రావాలి. అద్భుతమైన దేశ నిర్మాణం జరగాలి. అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు సీఎం కేసీఆర్‌.

మరిన్ని వార్తలు