Partha Chatterjee: మంత్రి పార్థా ఛటర్జీకి షాకిచ్చిన సీఎం మమత

28 Jul, 2022 17:32 IST|Sakshi

కోల్‌కత: టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రికన్‌స్ట్రక్షన్‌ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు.
(చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు)

అవన్నీ చెప్పలేం
‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్‌ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు  సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. 

కాగా, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్కామ్‌లో పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు గుర్తించిన ఈడీ కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని రికవరీ చేసింది. ఇవేకాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్చేంజీకి సంబంధించిన పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.
(చదవండి: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌)

మరిన్ని వార్తలు