యోగి ఢిల్లీ టూర్‌.. నాయకత్వ మార్పుపై చర్చ

10 Jun, 2021 17:44 IST|Sakshi

అమిత్‌ షా నివాసానికి చేరుకున్న యోగి ఆదిత్యానథ్‌

రేపు ప్రధానితో భేటీ కానున్న యూపీ సీఎం

లక్నో: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన 24 గంటల వ్యవధిలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సమాచారం. అప్నా దళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షాను కలిశారు.

యోగి బుధవారం అర్థరాత్రి లక్నోలో రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో సమావేశం నిర్వహించారు. ఇది ప్రతి నెలా జరిగే సాధారణ సమావేశం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఈ మీటింగ్‌కి హాజరు కావడానికి సునీల్ బన్సాల్ హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన లక్నోకు చేరుకున్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి

వచ్చే ఏడాది జరిగే కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో నాయకత్వ మార్పు గురించి ఇప్పటికే అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి అలానే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ని సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమైనందుకు యోగి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

చదవండి: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎంగా ప్రధాని సన్నిహితుడు

>
మరిన్ని వార్తలు